KTR: పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరేంటో అన్నీ తెలుసు: కేటీఆర్ 1 y ago
TG : అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్లోని ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలను విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేయనున్నారు.
బీజేపీ నేతల బాగోతాలు తన వద్ద ఉన్నాయని, పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరేంటో అన్నీ తెలుసన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని, ఆయన్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. ఈ రేసింగ్ కేసును రేవంత్ వదిలేసినా.. తాను వదలను అని, తాము అధికారంలోకి రాగానే ఈ రేసింగ్ ఏకపక్ష రద్దుపై విచారణ చేయిస్తామని చెప్పారు. ఎంఐఎం విషయంలో తాము కూడా తప్పు చేశామని, అధికారంలోకి వచ్చాక ఎంఐఎంకి తామేంటో చూపిస్తామన్నారు.
ఆడబిడ్డలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు అంతా బహిరంగంగానే చర్చించుకుంటున్నారని, 420 హామీలు అమలు చేస్తామని నమ్మించి కాంగ్రెస్ గద్దెనెక్కిందని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఉక్కు పాదం మోపి, జైలుకు పంపడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులపై అక్రమ కేసులు పెటి వేధిస్తోందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే యూట్యూబ్ జర్నలిస్టులపై అక్కసు వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు.